దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా సెకండ్ వేవ్ సినీ ఇండస్ట్రీని సైతం వెంటాడుతోంది. కోవిడ్ విజృంభణ కారణంగా ఇప్పటికే పలు సినిమాల షూటింగ్స్ వాయిదా వేసినా కూడా వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం, కొందరు కన్నుమూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ గాయకుడు (67) గత రాత్రి కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. అయితే గత రాత్రి పరిస్థితి విషమించి ఆక్సీజన్ లెవల్స్ పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమయానికి వెంటిలేటర్ లభించకపోవడంతో ఆనంద్ మృత్యువాత పడినట్లు తెలిసింది. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా తులగమ్ గ్రామం. ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత రంగంలో కొనసాగుతున్న ఆనంద్.. స్వరమాధురి సంస్థ స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా 6,500 పైగా కచేరీలు నిర్వహించారు. ఈ సంస్థ ద్వారా సినీ గాయకులను ప్రోత్సహించారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘పండంటి కాపురం’, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రాల్లో ఆయన పాటలు పాడారు. ఒక వేణువు వినిపించెను (అమెరికా అమ్మాయి) , దిక్కులు చూడకు రామయ్య, విఠలా విఠలా పాండురంగ విఠలా.. వంటి సూపర్ హిట్ పాటలను ఆనంద్ ఆలపించారు. కొన్ని సీరియల్స్, అనువాద చిత్రాలకు కూడా సంగీతం అందించారు. ఆనంద్ మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vP0V9W
No comments:
Post a Comment