Sunday, 2 January 2022

సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు కాదు.. మళ్లీ మళ్లీ చెప్తున్నా.. మోహన్ బాబు అసహనం!

టాలీవుడ్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ గురించి అందరికీ తెలిసిందే. టికెట్ రేట్ల అంశం ఇప్పుడప్పుడే ఓ కొలిక్కి వచ్చేలా లేదు. అయితే తాజాగా పెద్దరికం వద్దు అని అటు ప్రకటించాడు. ఇంతలోనే ముందు పడి టికెట రేట్ల అంశం మీద సుధీర్ఘ లేఖను వదిలాడు. ఇంత వరకు ఏపీ ప్రభుత్వంతో కొందరు సినీ పెద్దలు జరిపిన చర్చలు, జరిగిన భేటీలపై కౌంటర్లు వేశాడు. మొత్తానికి మోహన్ బాబు తన మనసులో ఉన్నదంతా కూడా ఇలా ప్రెస్ నోట్‌గా రిలీజ్ చేశాడు. ‘మనకెందుకు మనకెందుకు అని మౌనంగా ఉండాలా.. నా మౌనం చేతకానితనం కాదు.. చేవలేనితనం కాదు.. కొంత మంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు. నీ మాటలు నిక్కచ్చిగా ఉంటాయ్.. కఠినంగా ఉంటాయ్..కానీ నిజాలే ఉంటాయ్.. ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇది నీకు అవసరమా అన్నారు. అంటే వాళ్లు చెప్పినట్టు బతకాలా.. నాకు నచ్చినట్టు బతకాలా.. అనే ప్రశ్న ఎదురైంది.. దానికి సమాధానమే ఇది. సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, నలుగురు డిస్ట్రిబ్యూటర్స్ కాదు.. కొన్ని వేల మంది ఆశలు, కొన్ని వేల కుటుంబాలు, కొన్ని వేల జీవితాలు.. 47 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట.. అందరి జీవితాలతో ముడిపడిన ఈ సినిమా ఇండస్ట్రీ గురించి మనకు ఉన్న సమస్యల గురించి ముఖ్యమంత్రులకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒక చోట సమావేశమై సమస్యలు ఏంటి? పరిష్కరాలు ఏంటి?.. ఏది చేస్తే సినీ పరిశ్రమకి మనుగడ ఉంటుంది అని చర్చించుకోవాలి.. ఆ తర్వాత మాత్రమే సినిమాటోగ్రఫీ మంత్రుల్ని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసికట్టుగా కలవాలి. అలా కాకుండా నలుగుర్నే రమ్మన్నారు.. ప్రొడ్యూసర్స్ నుంచి నలుగురు, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ముగ్గురు, హీరోల నుంచి ఇద్దరు, ఏంటిది.. మళ్లీ మళ్లీ చెప్తున్నా సినిమా పరిశ్రమలో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అందరూ సమానం. ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు. చిన్న నిర్మాతల్ని కూడా కలుపుకుని ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్లి సమస్యల్ని వివరిస్తే మనకీ రోజు ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవి కావు.. సినీ పరిశ్రమలో ఒక పార్టీ వాళ్లు ఉండొచ్చు.. లేదా వేరు వేరే పార్టీల వాళ్లు ఉండొచ్చు అది వాళ్లిష్టం.. కాదనను. కానీ ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రుల్ని ముందుగా మనం కలవాలి.. వాళ్లని మనం గౌరవించుకోవాలి.. మన కష్టసుఖాలు చెప్పుకోవాలి. అలా జరిగిందా? జరగలేదు. నేను ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న టైంలో సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులందరినీ కలుపుకుని ఒక్కటిగా వెళ్లి అప్పటి సీఎం డా రాజశేఖర్ రెడ్డి గారిని కలిసి వైరసీ కోరల్లో సినిమా నలిగిపోతుంది, మా మీద దయచూపి బిక్షపెట్టండి అనగానే, ఆ మాట చాలా మందికి నచ్చలేదు. కానీ ఆయన్ను కదిలించింది. చాలా వరకు పైరసీని కట్టడి చేసింది, సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడే పనులు చాలా వరకు చేసి పెట్టింది అప్పటి ప్రభుత్వం. 350 రూపాయలు, 300 రూపాయల టికెట్ల రేట్లతో చిన్న సినిమాలు నిలబడటం కష్టం. 50 రూపాయలు, 30 రూపాయల టికెట్ల రేట్లతో పెద్ద సినిమాలు నిలబడటం కష్టం. చిన్న సినిమాలు ఆడాలి. పెద్ద సినిమాలు ఆడాలి. దానికి సరైన ధరలుండాలి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి ‘అయ్యా.. మా సినీ రంగం పరిస్థితి ఇది.. చిన్న సినిమాల్ని పెద్ద సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని మనకి న్యాయం చేయమని అడుగుదాం. సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి.. మా అందరికీ దేవుళ్లు నిర్మాతలు.. కానీ ఈ రోజున ఆ నిర్మాతలు ఏమయ్యారు.. అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఎందుకు మౌనం పాటిస్తున్నారో అర్థం కావట్లేదు.. మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది, ఒక్కటిగా ఉంటేనే సినిమా బతుకుతుంది.. రండి అందరం కలిసి సినిమాను బతికిద్దాం’ అని అన్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sRgqA0

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....