సెలబ్రిటీలు సాధారణంగా ఫిట్నెస్ కోసం సైక్లింగ్ చేస్తుంటారు. కానీ, ఒక మంచి పని కోసం సైక్లింగ్ చేస్తున్నారు. క్రీడల్లో రాణించాలనే కోరిక ఉన్న పేద దివ్యాంగులను ప్రోత్సహిస్తూ, వారికి శిక్షణ ఇస్తోన్న ఆదిత్య మెహతా ఫౌండేషన్కు నిధులు సేకరించడానికి 100 కి.మీ. సైకిల్ తొక్కుతున్నారు మంచు లక్ష్మి. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పటికే 35 కి.మీ. సైక్లింగ్ చేసినట్టు తెలిపారు. ‘‘ఆదిత్య మెహతా ఫౌండేషన్ కోసం 35 కిలోమీటర్లు సైకిల్ తొక్కినప్పుడు స్వచ్ఛమైన గాలి వాసన, శబ్దం నన్ను ఆశ్చర్యపరిచాయి. నేను 100 కిలోమీటర్లు సైక్లింగ్ చేయబోతున్నాను. ఇన్ఫినిటీ పారా స్పోర్ట్స్ అకాడమీ అండ్ రెహెబ్ సెంటర్లో శిక్షణ పొందనున్న పారా అథ్లెట్ల కోసం నిధులు సేకరించడానికి నేను 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతున్నాను’’ అని మంచు లక్ష్మి తన ట్వీట్లో పేర్కొన్నారు. పారా సైక్లింగ్లో జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించిన ఆదిత్య మెహతా ఈ ఫౌండేషన్ను స్థాపించారు. హైదరాబాద్లోని బేగంపేటలో ఇన్ఫినిటీ పారా స్పోర్ట్స్ అకాడమీ అండ్ రెహెబ్ సెంటర్ను నెలకొల్పి పారా అథ్లెట్లను తయారుచేస్తున్నారు. ఈ ఫౌండేషన్కు గత ఆరేళ్లుగా తన సేవలను అందిస్తున్నారు మంచు లక్ష్మి. నిధుల సమీకరణలో ఆదిత్య మెహతాకు సహాయపడుతున్నారు. తన ఫౌండేషన్ ద్వారా మరింత మంది పేద దివ్యాంగులకు పారా గేమ్స్లో శిక్షణ ఇచ్చేందుకు నిధుల సమీకరణ కోసం గతేడాది ‘ఇన్ఫినిటీ రైడ్ 2020’ని ఆదిత్య మెహతా ప్రారంభించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సైకిల్ రైడ్ సాగనుంది. దీనిలో భాగంగా మంచు లక్ష్మి 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కి నిధుల సేకరణ చేయబోతున్నారు. మంచు లక్ష్మి సైక్లింగ్ ఈనెల 28తో ముగియనుంది. అప్పటి వరకు సైకిల్ తొక్కుతూ నిధులు సేకరిస్తారామె. ఈ ఫౌండేషన్కు విరాళం ఇచ్చి పేద దివ్యాంగులు పారా గేమ్స్లో రాణించడానికి సహకరించాలని మంచు లక్ష్మి కోరుతున్నారు. మొత్తం రూ.5 లక్షలు లక్ష్యంగా పెట్టుకున్నారామె. ఇప్పటికి రూ.73 వేలు నిధులు సమకూరాయి. తన పిలుపు మేరకు మరింత ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తారని మంచు లక్ష్మి ఆశిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LqyMUW
No comments:
Post a Comment