Saturday, 5 December 2020

Mahanati Birth Anniversary: తెలుగు తెరకు చెరగని జ్ఞాపకం సావిత్రి.. మహానటి జీవితంలో ఎన్ని మలుపులో!!

మహానటి గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఈ అభినయ అందం గురించి ఇంతా గొప్పగా వర్ణించినా తక్కువే అవుతుంది. ఆనాటి నుంచి నేటివరకు సగటు ప్రేక్షకుడి మదిలో నిలిచిపోయారు సావిత్రి. ఒక్కటేమిటి వెండితెరపై అభినయం, ఆమె జ్ఞాపకాలన్నీ తీపి గురుతులే. తనకే సొంతం, తనకు మాత్రమే సాధ్యం అనే హావభావాలతో తెలుగు తెరపై ప్రకాశించి మన మధ్య లేకున్నా నేటికీ వెలుగులు జిమ్ముతోంది ఆ తెలుగు అందం. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకోవడంతో పాటు నేటి తారలకు స్ఫూర్తిగా నిలుస్తున్న నేడు (డిసెంబర్ 6). ఈ సందర్భంగా ఆమె జీవితంలోని ముఖ్య విషయాలు తెలుసుకుందామా.. 1936 డిసెంబర్ 6వ తేది గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రాపూర్ అనే గ్రామంలో గురవయ్య- దుర్గాంబ అనే దంపతులకు రెండో సంతానంగా సావిత్రి జన్మించారు. ఆరు నెలల వయస్సు రాగేనే తండ్రి గురవయ్య టైఫాయిడ్‌తో చనిపోవడంతో తల్లి దుర్గాంబ తన ఇద్దరి పిల్లలను తీసుకొని విజయవాడ లోని అక్కగారింటికి మకాం మార్చింది. వాళ్ళ బావగారైన కొమ్మారెడ్డి వెంకట్రామయ్య ఒక నాటకసంస్థను నడుపుతుండేవారు. సావిత్రి, అక్క మారుతి కస్తూరిదేవి మెమోరియల్ స్కూల్‌లో చదువుతుండేవారు. వారు వెళ్ళే దారిలో శిష్ట్లా పూర్ణయ్య అనే నాట్యాచారులు నృత్యపాఠశాలను నడుపుతుండేవాడు. అయితే సావిత్రి నృత్యం బాగా చేయడం గమనించిన వెంకట్రామయ్య ఆమెను పూర్ణయ్య దగ్గర నృత్య శిక్షకురాలిగా చేర్చారు. దీంతో పదేళ్ళు వచ్చేసరికే నాట్య ప్రదర్శనలు ఇచ్చేస్తాయికి ఎదిగింది. కొంగర జగ్గయ్య ఒకసారి ఆమె ప్రదర్శన చూసి తమ నాటకపరిషత్‌లో అవకాశం ఇచ్చారు. 13 ఏళ్ల వయస్సులోనే కాకినాడలో జరిగిన ఆంథ్రనాటక పరిషత్ ఉత్సవాలలో పాల్గొనడం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా వచ్చిన ఫృధ్పీరాజ్ కపూర్ ఆమెను సినిమాలలో చేరమని సలహా ఇవ్వడంతో 1949లో మద్రాసుకు ట్రైన్ ఎక్కేసింది సావిత్రి. మొదట యల్‌వి ప్రసాద్ 'సంసారం' అనే సినిమాలో అవకాశం ఇవ్వగా కొన్ని షాట్లు తీసిన తరువాత వయస్సు తక్కువగా ఉందనే కారణంతో ఆమెను తీసేశారు. తర్వాత 'పాతాళభైరవి' అనే సినిమాలో కనబడీ కనబడని పాత్రలో నటించింది. అయితే 'పెళ్ళిచేసి చూడు' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాఅది రెండవ కథానాయిక పాత్ర. 1953సంవత్సరం ఆమె జీవితాన్ని మరో మలుపుతిప్పింది. ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన 'దేవదాసు' సినిమాలో పార్వతి పాత్రకు ఎన్నికైంది సావిత్రి. అది కూడా అనుకోకుండా వచ్చిన అవకాశం. మొదట షావుకారు జానకిని తీసుకుంటే ఏవో ఇబ్బందలవల్ల ఆమె తప్పుకోవడంతో ఆ అవకాశం సావిత్రికి దక్కింది. కానీ అక్కినేని ఇంత చిన్నిమ్మాయ్ ఏం నటిస్తుందోనని అనుమానపడగా ఆయన అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆయననే మైమరపించింది సావిత్రి. ఇక అక్కడినుండి వెనుతిరిగి చూడలేదు. 1957లో వచ్చిన 'మాయా బజార్' సినిమాలో తన నటనా విశ్వరూపంచూపింది. ఎయన్‌ఆర్, యన్‌టిఆర్, యస్‌విఆర్ లాంటి హేమాహేమీలు నటించిన ఆ సినిమాలో వారందరినీ తన నటనతో డామినేట్ చేసింది సావిత్రి. మిస్సమ్మ, గుండమ్మకథ, వెలుగునీడలు, మూగనోము, డాక్టర్ చక్రవర్తి, రక్తసంబంధం లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించింది. అప్రహితంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఓ నిర్ణయం తన జీవితగమనాన్నే మార్చేసింది. తమిళ సినీపరిశ్రమలో అప్పటికే రెండు పెళ్ళిళైన జెమినీ గణేషన్‌ను వివాహమాడింది. కొంతమంది వద్దని వారించినా వినలేదు. పెళ్లి తర్వాత సావిత్రి ఫైనాన్షియల్ విషయాలు జెమినీ చేతిలోకి వెళ్ళాయి. తెలుగులో అఖండవిజయం సాధించిన మూగమనసులు సినిమాను జెమినీ గణేషన్‌ను పెట్టి తమిళంలో పునర్మించగా అది ఆశించనంతంగా విజయవంతం కాలేదు. అంతే అప్పుల ఊబిలో చిక్కుకుంది. జెమినీ గణేషన్, ఇద్దరు పిల్లలు దూరం అయ్యారు. అది తట్టుకోలేక మత్తుకి అలవాటు పడింది. ఒక మహానటి.. అప్పట్లోనే లక్షలు చూసిన నటి.. హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న నటి, చైనా యుద్దం అప్పుడు తన ఖరీదైన ఇంటిని అమ్మి ప్రధాని సహాయనిధికి ఇచ్చిన దేశభక్తురాలు, 1965లో ఢీల్లీలో తన ఒంటిపై ఉన్న అన్ని వారాల నగలను లాల్ బహదూర్ శాస్త్రి చేతిలో పెట్టిన తల్లి, తన ఇంటికి వచ్చినవారిని వట్టిచేతులతో పంపని దయాహృదయరాలు.. తన అనేవారు లేక ,కరుణచూపించేవారు లేక 1981 డిసెంబర్ 26న ఒక అనాధలా తనువు చాలించింది. ''బ్రతుకు పూల బాటకాదు.. అది పరవశించి పాడుకునే పాట కాదు" అనేది సావిత్రి జీవితంలో నిజమైంది. సావిత్రి 30 ఏళ్ల సినీ కెరీర్‌లో 252 సినిమాల్లో నటించారు. 1950-60లలో ఆమె ఇండియాలో ఎక్కువ ఆదరణ కలిగిన నటిగా కీర్తించబడ్డారు. కాగా సావిత్రి జీవితకథను తెలుగు ప్రేక్షకుల ముందుంచుతూ ఇటీవలే 'మహానటి' మూవీ రూపొందించారు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో సావిత్రి జీవితాన్ని, ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులను చూడొచ్చు. మహానటిగా కీర్తిసురేష్ కనబర్చిన అభినయం ఆమెకు తిరుగులేని గుర్తింపు తెచ్చింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JX2DDh

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....