కోట శ్రీనివాసరావు.. ఈ పేరు తెలియని తెలుగువాడు ఉండడు అంటే అతిశయోక్తికాదు. గత 38 ఏళ్లుగా తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అధ్యాయాన్ని రాసుకున్న గొప్ప నటుడు. అయితే, ప్రస్తుతం ఆయన వయోభారంతో కాస్త ఇబ్బంది పడుతున్నారు. కానీ, ఆ ఇబ్బంది తన నటనకు అడ్డుకాదని కోట అంటున్నారు. తనకు అన్ని అవయవాలూ బాగానే పనిచేస్తున్నాయని.. మాట కూడా స్పష్టంగా వస్తుందని.. వేషాలు ఇస్తే చేయడానికి తాను సిద్ధమని అంటున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్కు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు కోట. తన 38 ఏళ్ల కెరీర్లో తనకు వేషం ఇవ్వండి అని ఏనాడూ ఎవరినీ అడగలేదని ఆయన అన్నారు. కానీ, ఇప్పుడు అడగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఎంతో బిజీగా రోజుకి 20 గంటలు పనిచేసిన మనిషిని కరోనా వల్ల ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాను. నేను, మా ఆవిడ, కోడలు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. బోర్ కొట్టేస్తుంది. పిచ్చెక్కిపోతోంది. రోజూ వంద మంది మధ్యలో బతుకుతాను. 38 ఏళ్లు అలానే బతికాను. ఒక్కసారిగా ఒంటరిగా ఉంటే పిచ్చెక్కిపోతోంది’’ అని కోట చెప్పుకొచ్చారు. పనిలేకుండా ఇంట్లో ఒంటరిగా కూర్చోవడం భరించలేక ఈ మధ్య పవన్ కళ్యాణ్, చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్, వి.వి.వినాయక్ లాంటి పెద్దవాళ్లకు ఫోన్ చేసి వేషాలు ఇవ్వమని అడిగానన్నారు. ప్రస్తుతం తన వయసు 77 ఏళ్లని.. ఈ వయసులో కాళ్లు నొప్పులు, ఒళ్లు నొప్పులు లాంటివి ఉండవా అని కోట ప్రశ్నించారు. తాజాగా క్రిష్, పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక వేషం వేశానని కోట చెప్పారు. అలాగే చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్, క్రిష్ కాంబినేషన్లో రూపొందిన సినిమాలోనూ తాను నటించానన్నారు. ఈ సినిమా టైటిల్ ‘కొండపల్లి’ అని కూడా చెప్పారు కోట.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ei8kJq
No comments:
Post a Comment