మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా ప్రకాశ్రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య పోటీ నెలకొంది. కొన్ని రోజుల ముందు మంచు విష్ణుకు సపోర్ట్ చేస్తున్న సీనియర్ నటుడు వి.కె.నరేశ్ సినీ కళాకారులకు విందు ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి విందుకు సంబంధించిన మెసేజ్ ఒకటి ప్రకాశ్రాజ్ వర్గం నుంచి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ వీడియో ద్వారా కౌంటర్ ఇచ్చారు. సినీ కళాకారుల ప్రాణాలతో ఆడుకోకండంటూ విందు రాజకీయాలను తప్పుపట్టారు. వివరాల్లోకెళ్తే.. ఆదివారం ఉదయం బండ్లగణేష్ తన ట్విట్టర్లో ఓ వీడియో మెసేజ్ను పోస్ట్ చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ ‘‘విందులు, సన్మానాలంటూ రకరకాల పేర్లతో మా కళాకారులను ఒకచోట చేర్చకండి. గత రెండేళ్ల నుంచి అందరూ కరోనా భయంతో ఉన్నారు. నాలాంటివాళ్లు చాలా మంది చావు దాకా వెళ్లి వచ్చారు. మీకు ఓటు కావాలంటే మా సభ్యులకు ఫోన్ చేసి మీరు చేసే, చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు గురించి చెప్పండి. అంతే కానీ..ఈ విందుల పేరుతో ఓ దగ్గరకు చేర్చి వారి జీవితాలతో చెలగాటాలు ఆడొద్దని నా విన్నపం’’ అన్నారు. మొన్నటి వరకు ప్రకాశ్రాజ్ ప్యానెల్లోనే ఉన్న బండ్ల గణేశ్, జీవితా రాజశేఖర్ రాకతో బయటకు వచ్చేశారు. అంతే కాకుండా జీవితకు వ్యతిరేకంగా కార్యదర్శి పదవికి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ విందు రాజకీయాలంటూ వీడియో పోస్ట్ చేయడంపై పెద్ద దుమారమే రేగుతోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3A0RXc2
No comments:
Post a Comment