Sunday, 24 January 2021

వర్మ ‘డి-కంపెనీ’ టీజర్‌కు ఆదరణ కరవు.. ఊదరగొట్టినా ఫలితం లేదు!

అండర్ వరల్డ్ సినిమాలంటే ప్రేక్షకులకు ముందుగా గుర్చొచ్చేది సెన్సేషనల్ డైరెక్టర్ . ‘సత్య’, ‘కంపెనీ’ వంటి సినిమాలలో అండర్ వరల్డ్ మాఫియా గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు వర్మ. ఇప్పుడు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ‘డి-కంపెనీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు వర్మ. ‘డి-కంపెనీ’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతోన్న వర్మ.. దీనికి హైప్ తీసుకురావడానికి బాగానే ప్రచారం చేస్తున్నారు. చిత్ర ప్రచారంలో భాగంగా నిన్న (జనవరి 23న) టీజర్‌ను విడుదల చేశారు. హిందీ, తెలుగు భాషల్లో ఈ టీజర్ విడుదలైంది. హిందీ టీజర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ స్పార్క్ వరల్డ్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేయగా.. తెలుగు టీజర్‌ను ఆర్జీవీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే, ఈ టీజర్‌కు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. తెలుగులో ఓ మాదిరి హైప్ ఉన్న సినిమాకు ఒకటి రెండు రోజుల్లో 10 లక్షల వ్యూస్ వచ్చేస్తున్నాయి. అలాంటిది, ఇప్పటి వరకు ‘డి-కంపెనీ’ తెలుగు టీజర్‌కు సుమారు 3 లక్షల వ్యూస్.. హిందీ టీజర్‌కు 5 లక్షల వ్యూస్ మాత్రమే వచ్చాయి. అంతేకాదు, ఆర్జీవీ అభిమానులు మినహా మిగిలిన వారు ఈ టీజర్‌పై పెదవి విరుస్తున్నారు. నిజానికి ఈ టీజర్‌ను బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. వర్మపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే రితేష్ దేశ్‌ముఖ్, ఛార్మి కూడా టీజర్‌ను ట్వీట్ చేశారు. అయినప్పటికీ ఊహించిన స్థాయిలో ఈ టీజర్‌ ప్రేక్షకులను రీచ్ కాలేకపోయింది. దీన్ని బట్టి ప్రేక్షకుల్లో వర్మపై అంచనాలు తగ్గాయనే చెప్పాలి. ‘డి-కంపెనీ’ టీజర్‌లోనూ ఒకప్పటి వర్మ మార్క్ కనిపించలేదు. కొన్ని కెమెరా యాంగిల్స్, యాక్షన్ సీన్స్ పాత వర్మను గుర్తుచేస్తున్నా.. టీజర్ ఓవరాల్‌గా నిరాశపరిచింది. ఆఖరిలో వచ్చే ఒక్క డైలాగ్ మినహా టీజర్‌ మొత్తం బీజీఎంతోనే చూపించారు. 1993 ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీం ఓ చిన్న గ్యాంగ్‌ లీడర్‌ నుంచి పెద్ద గ్యాంగ్‌ స్టర్‌‌గా అండర్ వరల్డ్‌ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడన్నది ఈ సినిమాలో చూపించబోతున్నారు. టీజర్‌లో ఎలాంటి డైలాగ్స్‌ లేకుండా కేవలం బీజీఎంతోనే కంపెనీ స్టోరీ ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తూ చివర్లో చిన్న డైలాగ్‌ చెప్పించి ముగించారు వర్మ. 1993 ముంబై బాంబు పేలుళ్ల గురించి.. డి-కంపెనీ నీడలో బతికిన ఇతర గ్యాంగ్‌‌స్టర్ల గురించి ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ‘డి-కంపెనీ’ గ్యాంగ్‌‌స్టర్‌ సినిమాలన్నింటికి మదర్‌ లాంటిదని.. ఇది తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ అని రామ్ గోపాల్ వర్మ చెబుతున్నారు. అందుకే ‘డి-కంపెనీ’ సిరీస్‌ని మహా భారతంతో పోలుస్తూ దీనికి ‘మహాభారత్ ఇన్ అండర్ వరల్డ్’ అని క్యాప్షన్‌ పెట్టినట్టు వెల్లడించారు. ఒక వీధి ముఠాను భయంకరమైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌‌గా దావూద్‌ ఎలా మార్చాడనేదే ‘డి-కంపెనీ’ కథ అని ఆర్జీవీ పేర్కొన్నారు. స్పార్క్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై స్పార్క్ సాగర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఐదు భాషల్లో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3iIQxv1

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....