డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన టాలీవుడ్ నిర్మాతలు దూకుడు చూపిస్తున్నారా! అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసలు ఇంతకీ ఎవరా నిర్మాతలు.. ఏంటా దూకుడు? అనే వివరాల్లోకెళ్తే.. డిస్ట్రిబ్యూషన్ రంగంలో సునీల్ నారంగ్ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఏషియన్ సునీల్గా నైజాం ఏరియాలో ఆయనకు మంచి గ్రిప్ ఉంది. ఆయన చేతిలో థియేటర్స్ ఉండటం కూడా అందుకు కారణం కావచ్చు. డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ నుంచి లవ్స్టోరితో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన ఈయన పుస్కూరి రామ్మోహన్రావుతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. వీరు నిర్మించిన తొలి చిత్రం ‘లవ్స్టోరి’ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా విడుదల కాకుండా టాలీవుడ్, కోలీవుడ్తో పాటు బాలీవుడ్కు సుపరిచితుడైన ధనుశ్తో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ నిర్మాతలు మరో పాన్ ఇండియా మూవీని కూడా ప్లాన్ చేస్తున్నారట. అదెవరితో తెలుసా!... యూనివర్సల్ స్టార్ కమల్హాసన్తో. రీసెంట్గా వీరు కమల్హాసన్ను కలిసి చర్చించారు కూడా. దానికి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ విక్రమ్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న కమల్.. తదుపరి శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 పూర్తి చేసే గ్యాప్లో వీరితో సినిమా చేసే అవకాశం ఉందని టాక్. మరి దర్శకుడు ఎవరు? అనే విషయం త్వరలోనే బయటకు వస్తుంది. నిజంగా కమల్తో, సునీల్ నారంగ్-పుస్కూరి రామ్మోహన్రావు సినిమా అంతా అనుకున్నట్లు అయితే నిర్మాతలుగా వీరు మరో అడుగు ముందుకేసినట్లేనని సినీ వర్గాలు అనుకుంటున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3n9SZ20
No comments:
Post a Comment