తూర్పు లద్దాఖ్లోని గాల్వన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య ఏప్రిల్ నుంచి కొనసాగిన ఉద్రిక్తతలు తీవ్ర హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి. సోమవారం రాత్రి ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక కమాండింగ్ అధికారి సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఘటనపై దేశ మొత్తం తీవ్ర ఆవేదనకు గురైంది. వీరమరణం పొందిన సైనికులకు ఘనంగా నివాళులర్పించారు దేశ ప్రజలు. ఇటు టాలీవుడ్ ప్రముఖులు కూడా సైనికుల మృతిపై స్పందించారు. తమ ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పందిస్తూ... ‘ఈ వార్త విని తనకు ఎంతో బాధ కలిగిందన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మీరు గుండెల్లో ఎప్పుడూ బతికే ఉంటారన్నారు. మీ దేశ భక్తకి, ధైర్యానికి జోహార్లు. సైనికుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. జైహింద్. ’ అంటూ ట్వీట్ చేశారు. ఇటీవలే విడుదలైన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ ఆర్మీ జవాన్గా మనకు కనిపించిన విషయం తెలిసిందే. దేశం కోసం ప్రాణాలు విడిచిన అమరవీరుల ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. తమన్నా, దేవి శ్రీ ప్రసాద్, మంచు విష్ణు, అనీల్ రావిపూడి,నిఖిల్, వరుణ్ తేజ్, లక్ష్మీ మంచు వీరజవాన్లకి ఘన నివాళులు అర్పించారు. ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ట్వీట్ చేశారు. వీర మరణం పొందిన సైనికులకు ఘన నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె ట్వీట్ చేశారు. గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికులు రాత్రి రాళ్లు, రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో భారత కమాండింగ్ ఆఫీసర్ సహా 20మంది సైనికులు మరణించారని సైన్యం ప్రకటించింది. 17 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ఈ ఘటనలో అమరులైన సైనికుల సంఖ్య మరింత పెరిగే అవకాశమూ ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు చైనా వైపు కూడా కొందరు చనిపోయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గాయపడిన, చనిపోయిన చైనా జవాన్ల సంఖ్య 43 వరకు ఉండొచ్చని వార్తలొస్తున్నాయి. వార్తా సంస్థ ఏఎన్ఐ ఈ మేరకు వివరాలు వెల్లడించింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eliDcw
No comments:
Post a Comment