తెలుగు సినీ పరిశ్రమలో మరో కొత్త నిర్మాణ సంస్థ ఇటీవల ప్రారంభమైంది. అదే వర్గో పిక్చర్స్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు అద్వయ జిష్ణు రెడ్డి ఈ నిర్మాణ సంస్థను స్థాపించారు. తొలి ప్రయత్నంగా ‘సెహరి’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. హర్ష్ కనుమిల్లి, సిమ్రన్ చౌదరి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలు. హీరోగా పరిచయమవుతోన్న హర్ష్ ఈ సినిమాకు కథ కూడా అందించడం విశేషం. రెండు వారాల క్రితం ఈ సినిమాను హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, భరత్ నారంగ్, అల్లు బాబీ అతిథులుగా విచ్చేశారు. తాజాగా ఈ చిత్రం తొలి షెడ్యూల్ను పూర్తిచేసుకుంది. అయితే, హీరో హర్ష్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ను నటసింహా నందమూరి విడుదల చేశారు. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలయ్య చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘హీరో హర్ష్, నిర్మాత అద్వయ మా ఇంటికొచ్చారు. డైరెక్టర్ రాలేదు. హర్ష్ కథ మొత్తం నాకు చెప్పాడు. అంటే చెప్పిచ్చుకున్నా.. లేకపోతే 5 నిమిషాల్లో వెళ్లిపోయేవారే. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి మేనల్లుడు అద్వయ. కిరణ్ కుమార్ రెడ్డి, నేను నిజాం కాలేజీలో కలిసి చదువుకున్నాం. మా రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉంది. వారు మా ఇంటికి రావడంతో అందరం కుటుంబ సభ్యుల్లా కూర్చున్నాం. కథ చెప్పారు.. బాగుందని చెప్పాను’’ అని వెల్లడించారు. తాను ఉచితంగా సలహాలు కూడా ఇస్తానని.. ‘సెహరి’ సినిమా యూనిట్కు కూడా ఒక సలహా ఇచ్చానని బాలయ్య చెప్పారు. సినిమా అంటే ప్రేమ ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదని, అలాగే సినిమా నిడివి రెండు గంటల కన్నా ఎక్కువ ఉండకూడదని తాను సూచించానని బాలయ్య అన్నారు. అయితే, బాలకృష్ణ ఈరోజు చాలా చమత్కారంగా మాట్లాడారు. జోకులు పేల్చారు. ‘ప్రొడక్షన్ హౌస్కి వర్గో అని పేరు పెట్టారు. వర్జిన్ అని పెడితే బాగుండు’ అని సరదాగా అన్నారు. అలాగే, హీరోని కూడా నువ్వు వర్జిన్ కదా.. అదే హీరోగా తొలి సినిమా కదా అంటూ చమత్కరించారు. అలాగే, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా చాలా బాగుందని.. సినిమా విజయం సాధించాలని బాలయ్య ఆకాంక్షించారు. కాగా, ఈ చిత్రంలో అభినవ్ గోమటం, ప్రనీత్ కళ్లెం, అనీషా రెడ్డి, అక్షిత శెట్టి, రాజేశ్వరి, శ్రిస్తి, అనీల్ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూరుస్తున్నారు. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవితేజ గిరిజల ఎడిటర్. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38Nvqob
No comments:
Post a Comment