Saturday, 26 September 2020

S. P. Balasubrahmanyam: నా సమాధిపై ఇలా రాయండి.. అదే నా ఆస్తి.. ఆ రోజే చెప్పిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

దిగ్గజ గాయకుడు మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటుగా మిగిలింది. ఆయన మరణవార్త తెలియగానే యావత్ సినీ సంగీత ప్రపంచం మూగబోయింది. గాన శిఖరం నెలకొరిగిందని తెలిసి కోట్లాది మంది గుండె పగిలింది. సినీ, ప్రేక్షక లోకం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే ఎంతో సేవాగుణం ఉన్న బాలసుబ్రహ్మణ్యం.. గత కొన్నేళ్ల క్రిందటే తన సమాధిపై రాయాల్సిన పదాలను చెప్పారు. ప్రతి మనిషికి ఏదో ఒకరోజు మరణం వస్తుందని, చావుకు భయపడనని ఎన్నోసార్లు చెప్పిన ఎస్పీ బాలు జ్ఞాపకాలు ఇప్పుడు నెమరు వేసుకుంటున్నారంతా. బాలు గురించి : 1999 సంవత్సరంలో పాడుతా తీయగా మెగా ఫైనల్స్ కోసం బాలుతో పాటు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు. రాజేశ్వర్ రావు, మహదేవన్, ఎల్‌ఆర్ ఈశ్వరి, సుశీల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలమురళీకృష్ణ అంటే ఎస్పీ బాలుకు చెప్పలేనంత అభిమానం, గురు భక్తి ఉండేది. అయితే ఈ కార్యక్రమంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ మాట్లాడుతూ.. బాలు గురించి ఎంతో గొప్పగా చెప్పడంతో ఆయన తెగ మురిసిపోయారు. బాలు కాస్త కష్టపడితే నాలాగా పాడగలడు కానీ.. నేను ఎంత కష్టపడినా మా అబ్బాయిలా పాడలేను అంటూ పుత్ర వాత్సల్యం ప్రదర్శించారు మంగళంపల్లి. అంతకుమించిన ఆస్తి ఇంకోటి లేదు: ఇదే విషయాన్ని 2017లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంటూ తన మరణం తర్వాత సమాధిపై ఏమని రాయాలో చెప్పారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆ రోజు (1999 సంవత్సరంలో) మంగళంపల్లి బాలమురళీకృష్ణ తన గురించి మాట్లాడిన మాటలకంటే గొప్ప ప్రశంస, ఆస్తి ఇంకోటి లేదని అన్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి గొప్ప సంగీత కళాకారులు అలాంటి మాటలతో తనకిచ్చిన స్ఫూర్తి ఎన్నటికీ మరువలేనిదని చెప్పారు. తను చనిపోయిన తర్వాత సమాధిపై ఏమైనా రాయాలా అంటే ఒక అవతారపురుషుడు మంగళంపల్లి తనను ఇలా ప్రశంసించారని రాస్తే సరిపోతుందని బాలు పేర్కొన్నారు. తండ్రి కోరిక మేరకు చరణ్: దీంతో బాలు మరణం తర్వాత ఇప్పుడు ఆయన చెప్పిన ఈ మాటలు గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు అభిమానులు. అయితే తన తండ్రి కోరిక మేరకు ఈ వ్యాఖ్యలు బాలు సమాధిపై రాయించాలని ఆయన కుమారుడు చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు (సెప్టెంబర్ 26) తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చెన్నై సమీపంలోని తామరైపాకం ఫామ్‌హౌస్‌లో బాలు అంత్యక్రియలు ముగిశాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్దీవదేహానికి నివాళులర్పించి కన్నీటి వీడ్కోలు చెప్పారు. చిరంజీవి కెరీర్‌కి పునాది: గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు బాలసుబ్రహ్మణ్యం. 1979,1981,1983,1988,1995,1996లో మొత్తం ఆరుసార్లు జాతీయ అవార్డులను అందుకున్న ఆయన గిన్నీస్ బుక్‌ రికార్డు సైతం సొంతం చేసుకున్నారు. పలు భాషల్లో 40 వేల పైచిలుకు పాటలు పాడి ఎంతోమంది నటీనటుల కెరీర్‌కి పునాది వేశారు. బాలు మరణం తర్వాత స్పందించిన మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆవేదన చెందుతూ తన కెరీర్‌లో అతిముఖ్యమైన వ్యక్తి బాలు గారని చెప్పారు. 80, 90 దశకాల్లో తన సినిమాల్లో ఆయన పాడిన పాటలతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని తెలపడం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2S0KkxT

No comments:

Post a Comment

Meet The Serial Killer Of Daldal

'I've been someone who has been interested in the mind of a criminal for years.' from rediff Top Interviews https://ift.tt/2CO...