ఈ రోజు (మంగళవారం) తెల్లవారు జామున ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ జయప్రకాశ్ రెడ్డి (74) గుండెపోటుతో మరణించడంతో తెలుగు చిత్రసీమ ఉలిక్కిపడింది. లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లపై ప్రభుత్వం నిషేధించడంతో గత నాలుగు నెలలుగా గుంటూరులో ఉన్న తన సొంతింట్లో ఉంటున్నారు జయప్రకాశ్ రెడ్డి. నేటి తెల్లవారు జామున బాత్ రూమ్ వెళ్లేందుకు లేచిన ఆయన బాత్రూమ్లోనే కుప్పకూలారు. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే లోపే తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జయప్రకాశ్ రెడ్డి మరణవార్త తెలియగానే డైరెక్టర్ అనిల్ రావిపూడి వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ ఆవేదన చెందారు. ''జయప్రకాశ్ రెడ్డి గారితో నా ప్రయాణం ఎంతో ప్రత్యేకమైంది. నేను చేసిన చాలా సినిమాల్లో ఆయన నటించారు. నన్ను తన సొంత మనిషిగా భావించేవారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. నటుడిగా, వ్యక్తిగా జయప్రకాశ్ రెడ్డి గారిని రీ ప్లేస్ చేసే వ్యక్తిలేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు అనిల్ రావిపూడి. ''అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను'' అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. ''జయప్రకాశ్ రెడ్డి మరణం చాలా బాధాకరం. ఆయనతో చాలా సినిమాల్లో కలిసి పని చేశాను. ఆయన కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'' అని పేర్కొన్నారు. ''సహచర నటుడు జయప్రకాష్ రెడ్డి గారు హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నటనంటే ఆయనకు ప్రాణం. అటు వెండితెరపైన, ఇటు స్టేజ్ నాటకాలలోను పోషించిన పాత్రలకు ప్రాణం పోసిన నటుడాయన. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాను'' అని ప్రకాష్ రాజ్ తన సంతాపాన్ని తెలిపారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3m2P4Ri
No comments:
Post a Comment