మాటల మాంత్రికుడు శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ ప్రస్తుతం సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇది బన్నీకి 19వ సినిమా. పూజా హెగ్డే, నివేతా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం కాకినాడలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ విషయంలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు వచ్చాయని ప్రస్తుతం ఫిల్మ్ నగర్ టాక్. తండ్రీకొడుకుల కథకు హాస్యాన్ని జోడించి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలని దర్శకుడు త్రివిక్రమ్ నిర్ణయించుకున్నారట. కానీ, బన్నీకి మాత్రం ఐటమ్ సాంగ్ పెట్టడం అస్సలు ఇష్టంలేదని సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ రెండు సినిమాలను తెరకెక్కించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లేవు. ‘జులాయి’లో ఉదయభాను ఐటమ్ సాంగ్ చేస్తారని అప్పట్లో విపరీతంగా ప్రచారం జరిగింది. కానీ, చివరకు అది జరగలేదు. ఇప్పుడు మరోసారి బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో ఐటమ్ సాంగ్ అంశం తెరమీదికి వచ్చింది. సినిమాలోని ఒక కీలక సందర్భంలో ఐటమ్ సాంగ్ కచ్చితంగా ఉండాలని త్రివిక్రమ్ అభిప్రాయపడుతున్నారట. కానీ, ఈ హిలేరియస్ ఫ్యామిలీ డ్రామాలో ఐటమ్ సాంగ్ ఉంటే బాగోదని బన్నీ అంటున్నారట. ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ, బన్నీ-త్రివిక్రమ్ మధ్య ఐటమ్ సాంగ్ కోసం విభేదాలు వచ్చాయనే వార్త హాట్ టాపిక్గా మారింది. కాగా, ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ నటి టబు, యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో రావు రమేశ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో హర్షవర్థన్ను తీసుకున్నారు. ప్రస్తుతం కాకినాడలో యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తు్న్నారు. ఇక్కడ 10 రోజులపాటు షూటింగ్ జరపనున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KtTv5P
No comments:
Post a Comment