తమిళంలో హిట్ అయిన ‘‘శతురంగ వెట్టై” చిత్రాన్ని తెలుగులో ‘‘బ్లఫ్ మాస్టర్”గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్, నందితా శ్వేత హీరోహీరోయిన్లుగా గోపీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. 2018 డిసెంబర్ 28న విడుదలైన ‘‘బ్లఫ్ మాస్టర్’’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సత్యదేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాను ఇప్పుడు మెగాస్టార్ చూశారు. లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటోన్న చిరంజీవి పలు చిన్న సినిమాలను వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాను చూశారు. ఈ సినిమా ఆయనకు బాగా నచ్చడంతో దర్శకుడు గోపీ గణేష్ను ఇంటికి పిలుపించుకుని అభినందించారు. ఈ విషయాన్ని గోపి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. Also Read: ‘‘విశాల హృదయుడు అయిన మెగాస్టార్ నా ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాను చూశారు. నన్ను ఇంటికి పిలిచి అభినందించారు. సినిమా చూసి, నన్ను ప్రశంసించినందుకు ప్రియమైన చిరు సార్కి ధన్యవాదాలు. విశాల హృదయం కలవారు మాత్రమే మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. మీరు విశాల హృదయులు. నా గురించి మీరు చెప్పిన మాటలు ఎప్పటికీ నా హృదయంలో పదిలంగా ఉంటాయి. థాంక్యూ సార్’’ అని గోపి ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు, చిరంజీవితో దిగిన ఫొటోను కూడా ట్వీట్లో పొందుపరిచారు. ఈ ఫొటోలో చిరు క్లీన్ షేవ్తో, మీసం లేకుండా కనిపించారు. కాగా, ఈ ట్వీట్ను కాసేపటికే గోపీ గణేష్ డిలీట్ చేశారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మేట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. లాక్డౌన్ కారణంగా తాత్కాలికంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇంకా తిరిగి మొదలుకాలేదు. పరిస్థితులు చక్కబడిన తరవాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2CRQAE4
No comments:
Post a Comment