Sunday, 22 September 2019

ఆ డైలాగు చిరంజీవి తప్ప ఏ హీరో చెప్పినా జనం ఒప్పుకోరు: సాయి మాధవ్ బుర్రా

మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చే సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ సినిమాకు సాయి మాధవ్ డైలాగులే హీరో అని చెప్పొచ్చు. ఆ తరవాత ఆయన ‘ఖైదీ నం. 150’, ‘మహానటి’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ వంటి భారీ చిత్రాలకు మాటలు రాశారు. ఇప్పుడు చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’కి సాయి మాధవ్ బుర్రా అద్భుతమైన డైలాగులు రాశారు. ఈ సినిమాకు పనిచేయడం తన అదృష్టమని ఆయన అంటున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న ఆయన.. తన అనుభవాలను పంచుకున్నారు. చిరంజీవిని ఆకాశానికి ఎత్తేశారు. ‘‘తరలి రాద తనే వసంతం.. తన దరికి రాని వనాల కోసం అన్నట్టు మెగాస్టార్ ఒక్క పిలిపిస్తే వసంతాలు కాదు సముద్రాలు కూడా తరలి వస్తాయి’’ అంటూ మెగా అభిమానులకు మంచి ఊపిచ్చే మాటలతో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ‘‘మా అమ్మమ్మ సినిమా పిచ్చిది. 80ల్లో హీరోలెవరూ మా అమ్మమ్మకు తెలీదు. కానీ, ఒక్క చిరంజీవి గారు మాత్రం మా అమ్మమ్మకు తెలుసు. టేప్ రికార్డర్‌లో ఒక క్యాసెట్‌ను పెట్టుకుని ఆ పాటను ప్రతి రోజూ ఎంజాయ్ చేస్తూ ఉండేది. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ.. కొండెక్కి చూసింది చందమామ.. కోయిలమ్మ గొంతులో రాగాలు.. చందమామ మనసులో భావాలు.. దిద్దినకదింత, దిద్దినకదింత. ఆ దిద్దినకదింత అన్నప్పుడు మా అమ్మమ్మ ఎంత ఎంజాయ్ చేసేదో నేను కళ్లారా చూశాను. అప్పుడు మా అమ్మమ్మకు 65 ఏళ్లు. నేను కృష్ణానగర్‌లో అవకాశాల కోసం తిరుగూ ఉంటే నాకు ఫోన్ చేసి.. అరేయ్, చిరంజీవిని కలవరా, ఆయనకి సినిమా రాయరా, ఒక్క డైలాగైనా ఆయనకు రాయరా అంటూ ఉండేది. చిరంజీవిగారికి మాటలు రాయడం ఏంటమ్మమ్మా.. అది జరిగే పనికాదు, అలాంటి అవకాశాలు రావు, ఆకాశాన్ని అందుకోమని చెబుతున్నావు, అది జరిగే పనికాదు, ఫోన్ పెట్టేయ్ అని చెప్పేవాడిని. అలాంటి నేను చిరంజీవి గారి సినిమాకి మాటలు రాశాను. ఖైదీ నంబర్ 150 సినిమాకి వేమారెడ్డితో కలిసి నన్ను మాటలు రాయమని చిరంజీవి అడిగారు. సార్, మీకు ఒక్క డైలాగ్ రాసినా చాలు నాకు.. ఈ జన్మధన్యం అని చెప్పి వచ్చేశాను. అప్పుడనుకున్నాను.. చిరంజీవి చెబితేనే సరితూగే డైలాగు రాయాలి అని. ఆ స్థాయిలో డైలాగు రాయాలి అని అనుకొని రాశాను, అదే.. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది అని. ఈ డైలాగు చిరంజీవిగారు తప్ప ఇంకెవ్వరు చెప్పినా జనం ఒప్పుకోరు. నేను గుండెల మీద చేయివేసుకొని చెప్పగలను.. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది అని చెప్పగలిగేది ఒక్క చిరంజీవిగారు మాత్రమే. అలా, ఇద్దరు డైలాగు రైటర్స్‌లో నేను ఒక్కడినయ్యాను అని ఉప్పొంగిపోయిన నాకు.. వెంటనే సినిమా మొత్తం రాసే అవకాశం వచ్చింది. ఇక అంతకంటే ఏం కావాలండి నాకు. ఈ సినిమాలో ప్రతి డైలాగ్ బాగుంటుంది. ఇది చరిత్ర.. చరిత్ర సృష్టించబోతుంది’’ అని సాయి మాధవ్ బుర్రా చాలా ఆవేశంగా మాట్లాడారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Oh37Eu

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....