Sunday, 17 November 2019

ఆమె నిండు గర్భిణి.. ఏఎన్నార్ సినిమా.. ఆసక్తికర కథ చెప్పిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఒక చిన్న కథ చెప్పారు. ఆ కథ చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే, కథ చివరికి వచ్చే సరికి అందరి ముఖాల్లో ఆశ్చర్యం. ఎందుకంటే.. ఆ కథలో దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ఇంతకీ, చిరంజీవి ఈ కథ చెప్పింది ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో. 2018, 2019 సంవత్సరాలకు గాను శ్రీదేవి, రేఖలకు ఏఎన్నార్ నేషనల్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఒక చిన్న కథతో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ‘‘అదొక పల్లెటూరు. కొత్తగా పెళ్లయిన జంట. ఆవిడ గర్భవతి. నవ మాసాలు నిండాయి. రేపో మాపో డెలివరీ అయ్యే సమయం. బిడ్డకు జన్మనిచ్చిన తరవాత సినిమా చూసే అవకాశం ఉండదు. తన అభిమాన నటుడి సినిమా విడుదలైంది. పక్కనున్న టౌన్‌కు వెళ్లి సినిమా చూడాలి. ఈ కోరికను తన భర్తకు చెప్పుకుంది. ఈ సమయంలో ఎలా వెళ్తావు అన్నాడు భర్త. ఎలాగైనా వెళ్లాలి అంది. గర్భంతో ఉన్న భార్య కోరిక తీరుద్దామని ఆ యువకుడు సరే అన్నాడు. Also Read: అయితే, సినిమా చూడాలంటే అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్‌కు వెళ్లాలి. అప్పుడు బస్సులు లాంటి రవాణా సౌకర్యం లేదు. జట్కా బండిలో వెళ్లాలి. గతుకుల రోడ్డు. సరే.. కూర్చొని కష్టపడి గతుకుల రోడ్డులో సినిమాను ముందుగానే ఊహించుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో రోడ్డు మీద పశువుల మంద వస్తోంది. దీంతో గుర్రం కొంచెం కంగారు పడింది. చక్రం గుంతలో పడటంతో జట్కా బండి కింద పడిపోయింది. ఆ జంట కూడా కింద పడిపోయారు. ఆ భర్త చాలా కంగారుపడ్డాడు. నిండు గర్భిణి అయిన తన భార్యకు ఎలా ఉందోనని భయపడ్డాడు. వెంటనే ఆమెను లేవదీసి ఎలా ఉందని అడిగాడు. చిన్న చిన్న దెబ్బలే పర్వాలేదు అంది. సర్లే వెనక్కి వెళ్లిపోదాం.. రిస్క్ చేయొద్దు అన్నాడు భర్త. ఏమైనా సరే చూడాలి అని ఆ అమ్మాయి అంది. సరే భార్య అంతలా కోరుకుంటోంది కదా అని తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకెళ్లాడు. ఆ సినిమా చూశారు. ఆమె ఎంతో ఆనందించింది. ఇంటికొచ్చిన తరవాత సినిమా చూపించిన భర్తపై ఎంతో ప్రేమ కురిపించింది. Also Read: ఈ కథలో ఆ గర్భిణి మా అమ్మ అంజనాదేవి. ఆ యువకుడు మా నాన్న వెంకట్రావు గారు. ఆ పల్లెటూరు మొగల్తూరు.. పక్కనున్న టౌన్ నర్సాపురం. సంవత్సరం 1955. ఆ సినిమా ‘రోజులు మారాయి’. ఆ కథానాయకుడు ఎవరో కాదు.. ఈ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అమ్మకి ఆయనంటే అంత పిచ్చి. ఆయన సినిమాలను ఏదీ వదిలిపెట్టలేదు. ఇంతకీ ఆ కడుపులో ఉన్నది నేనే. అమ్మకు సినిమా మీద, నాగేశ్వరరావు గారి మీద అంత అభిమానం ఉంది కాబట్టే.. బహుశా కడుపులో ఉన్న నాకు కూడా సినిమా అంటే అంత ఇష్టం ఏర్పడింది’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. తన చదువు అయిపోయిన వెంటనే ఎలాంటి ఆలోచన లేకుండా సినిమా ఇండస్ట్రీకి రావాలని కోరుకున్నట్లు చిరంజీవి చెప్పారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి మహానటులు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో తాను రావడం, నిలదొక్కుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చిరంజీవి వెల్లడించారు. ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించడం తనకు అద్భుతమైన జ్ఞాపకం అని చెప్పారు. ఆ సినిమా ద్వారా ఏర్పడిన పరిచయం వల్ల వ్యక్తిగతంగా నాగేశ్వరరావు తనను ఇష్టపడ్డారని వెల్లడించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32ZSJoB

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....